చెన్నై: తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలోని కట్టుపాక్కం గ్రామానికి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న బైకులపైకి దూసుకెళ్లింది. మొత్తం మూడు బైకులను లారీ తొక్కేసింది. ఈ ఘటనలో బైకులపై వెళ్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం గురించి తెలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుడికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.