అమృత్సర్: పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అమృత్సర్ నగరంలోని మజీతా రోడ్డులో గల ఓ ఔషధాల తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని బయటికి పరుగులు తీశారు. కానీ ఒక మహిళ సహా నలుగురు మాత్రం ఫ్యాక్టరీ నుంచి బయటపడలేక మంటల్లో చిక్కుకున్నారు. సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.