జోధ్పూర్: ఇంట్లో వంట కోసం తెచ్చి పెట్టుకున్న గ్యాస్ సిలిండరే ఆ కుటుంబం పాలిట మృత్యువయ్యింది. వారి ఇరుగుపొరుగును గాయాలపాలు చేసింది. బహుళ అంతస్తుల భవనంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ కుటుంబానికి చెందిన నలుగురు అక్కిడకక్కడే దుర్మరణం పాలయ్యారు. వారి ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే మరో 16 మందికి గాయాలయ్యాయి.
రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ జిల్లాలోని కీర్తి నగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.