తిరువనంతపురం: కేరళలో ఇటీవల నిపా వైరస్(Nipah virus) కలవరం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ వైరస్ సోకిన నలుగురు ప్రస్తుతం ఆ వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కోజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆ నలుగురు నిపా వైరస్ నుంచి తేరుకున్నట్లు ఆమె వెల్లడించారు. రెండు సార్లు వాళ్లకు వైరస్ పరీక్ష చేశామని, రెండు సార్లు వాళ్లు నెగటివ్గా వచ్చినట్లు మంత్రి తెలిపారు. కోలుకున్న నలుగురు పేషెంట్లలో ఓ 9 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఆ నలుగురికి డబుల్ నెగటివ్ పరీక్ష చేశామని, అంటే రెండు సార్లు శ్యాంపిళ్లను తీసుకుని పరీక్ష చేశామన్నారు. నలుగురు నెగటివ్ తేలడంతో కేరళ నిపా వైరస్ నుంచి విముక్తి అయినట్లు మంత్రి తెలిపారు. 9 ఏళ్ల బాలుడు చాలా వారాల పాటు వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నాడు.