తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. తాజాగా తిరువనంతపురంకు చెందిన 16 ఏళ్ల అమ్మాయిలో వైరస్ లక్షణాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ మహిళ నమూనాలను కోయంబత్తూరు ల్యాబ్కు పంపించామని, పరీక్షల్లో జికా నిర్ధారణ అయినట్లు చెప్పారు. వైరస్ సోకినవారిలో 35 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నట్లు వెల్లడించారు. కాగా, మరో నమూనాలను అలప్పూజాలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్కు పంపించామని, అయితే వారికి వైరస్ నిర్ధారణ కాలేదని తెలిపారు. గత ఆదివారం ముగ్గురికి జికా సోకిన విషయం తెలిసిందే.
జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాదు. అయితే దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.
రెండో దశలో కరోనా వైరస్ కేరళలో విజృంభిస్తున్నది. జూలై నెలలో తొలి 11 రోజుల్లో 1,28,951 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రం ఇదే కావడం విశేషం. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.