Road Accident | పనాజీ : గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వద్ద కూలీలు నిద్రిస్తున్న గుడిసెలోకి ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తేల్చారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. క్షతగాత్రులకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బంది జాప్యం చేయడంతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మృతుల బంధువు రూపేందర్ మాథుర్ మాట్లాడారు. ఈ ప్రమాదం జరిగిన సమయంతో తనకు ఫోన్ కాల్ రావడంతో గుడిసె నుంచి బయటకు వచ్చానని తెలిపాడు. అంతలోనే గుడిసెలోకి బస్సు దూసుకెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయినట్లు కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్ బెదిరించినట్లు రూపేందర్ వాపోయాడు.