లక్నో: వివాహిత వ్యక్తితో కలిసి పారిపోయిన వివాహిత సోదరి, ప్రియుడ్ని ఆమె నలుగురు సోదరులు హత్య చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసరా గ్రామానికి చెందిన మహాజబీ, ఆమె ప్రియుడు మొహమ్మద్ ఆరిఫ్ వివాహితులు. కాగా, ముగ్గురు పిల్లల తల్లి అయిన మహాజబీ 29 ఏళ్ల ఆరిఫ్తో కలిసి అక్టోబర్ 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వారిద్దరి కోసం గాలించారు. ఆ జంట మీరట్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి వారిద్దరిని అసరా గ్రామానికి తీసుకువచ్చారు.
కాగా, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చిందన్న ఆగ్రహంతో నలుగురు సోదరులు మహాజబీతోపాటు ఆమె ప్రియుడు ఆరిఫ్ను మంగళవారం రాత్రి హత్య చేశారు. గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో మహాజబీ మృతదేహం, సమీపంలోని లూంబ్ గ్రామంలో ఆరిఫ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన మహాజబీ సోదరుడు ముర్సాలీన్ను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. నలుగురు సోదరులం కలిసి తమ సోదరితోపాటు ఆమె ప్రియుడ్ని హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. దీంతో మరో సోదరుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో ఇద్దరు సోదరుల కోసం వెతుకున్నారు.