చండీగఢ్: పంజాబ్లోని కోట్కాపురాలో 2015లో జరిగిన కాల్పుల కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్కు కొత్తగా ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిటైర్డ్) కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని మునుపటి సిట్ దాఖలు చేసిన అన్ని నివేదికలను పంజాబ్, హర్యానా హైకోర్టు ఏప్రిల్ 9 న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది. ఆరు నెలల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్ బ్యూరో) ఎల్కె యాదవ్ నేతృత్వంలోని సిట్లో లూధియానా పోలీసు కమిషనర్ రాకేశ్ అగర్వాల్, ఫరీద్కోట్ రేంజ్ డిఐజి సుర్జిత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కొత్త సిట్ మే 13న దర్యాప్తును ప్రారంభించింది. మునుపటి దర్యాప్తు బృందానికి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు తిరిగి సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్కు కూడా సమన్లు పంపింది. ఈ నెల 16న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.