అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులు ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. తాజాగా పాటీదార్ ఉద్యమకారణి రేష్మా పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు రేష్మా పటేల్. ఇవాళ ఆప్ రాజ్యసభ సభ్యులు, గుజరాత్ కో ఇంచార్జి రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో రేష్మా పటేల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమెకు ఆప్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. 2015లో పాటీదార్ కోటా కోసం రేష్మా పటేల్ ఉద్యమించారని గుర్తు చేశారు. గుజరాత్లో ఆమెకు మంచి పేరు ఉందన్నారు. ఆమె చేరిక ఆప్కు మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఇతర పార్టీలకు గట్టి పోటీని ఇస్తుందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు.