ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఆ పార్టీని వరుసగా పలువురు నేతలు వీడుతూ వస్తున్నారు. తాజాగా మాజీ ప్రతిపక్షనేత, మాజీ మంత్రి రాందాస్ కదమ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇంతకు ముందు ఆయన తనయుడు ఎమ్మెల్యే యోగేశ్ కదమ్ షిండే వర్గంలో చేరారు. ఇటీవల రవాణా మంత్రి అనిల్ పరాబ్తో రాందాస్కు విభేదాలున్నాయని, ఈ క్రమంలో ఆయన పార్టీని వీడుతారనే ఊహాగానాలు వినిపించాయి.
ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆయనను కలిసి బుజ్జగించారు. ఆ తర్వాత చివరి శ్వాస వరకు తాను శివసేనతోనే ఉంటానని కొద్దిరోజుల కిందట రాందాస్ కదమ్ ప్రకటించారు. శివసేనకు, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన కుమారుడు యోగేష్ కదమ్కు పార్టీ నాయకత్వంతో కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా తాను శివసేనను వీడనని పేర్కొన్నారు.