ముంబై: మనీలాండరింగ్, బలవంతపు వసూళ్ల కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మరో మూడు రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉండనున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు ది స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కోర్టు ఆయన కస్టడీని ఈ నెల 15 వరకు పొడిగించింది. కోర్టులో హాజరుపర్చడానికి ముందు ఈడీ అధికారులు ఆయనకు వైద్యపరీక్షలు చేయించారు.
కాగా, మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన అనిల్ దేశ్ముఖ్ను స్పెషల్ కోర్టు ఈ నెల 6న జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే తమ కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ అభ్యర్థనను తోసిపుచ్చింది. దాంతో మరుసటి రోజు ఈడీ బాంబే హైకోర్టు వెళ్లగా.. స్పెషల్ కోర్టు తీర్పును పక్కనబెట్టి అనిల్ దేశ్ముఖ్ను ఈ నెల 12 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. నేటితో ఆ గడువు ముగియడంతో కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దాంతో కోర్టు అనిల్ దేశ్ముఖ్ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.