న్యూఢిల్లీ : కర్నాటక కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, బెంగళూర్కు చెందిన బీ భాస్కర్రావు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. పోలీస్ బలగాల్లో వివిధ పదవుల్లో పనిచేసిన భాస్కర్ రావును పార్టీలోకి ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సాదరంగా స్వాగతించారు. కర్నాటక శాఖ కన్వీనర్ పృధ్వీ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్, ఎమ్మెల్యే దిలీప్ పాండ్, వ్యవస్ధాపక కార్యదర్శి దామోదరన్ ఇతర నేతల సమక్షంలో ఆయన ఆప్లో చేరారు.
భాస్కర్రావు కర్నాటక ఏడీజీపీ (రైల్వేస్)గా పనిచేస్తూ గత ఏడాది సెప్టెంబర్లో రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించిన కర్నాటక ప్రభుత్వం ఆయనను సర్వీస్ నుంచి రిలీవ్ చేయడంతో ఆప్లో చేరేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. బెంగళూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భాస్కర్రావు చేరిక ఆప్ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది.
పంజాబ్లో అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఆప్ వచ్చే ఏడాది జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. 2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆప్ పోటీచేసింది. 28 స్ధానాల్లో ఆప్ అభ్యర్ధులు బరిలో దిగగా ఆ పార్టీ అసెంబ్లీలో ఖాతా తెరవలేదు.