న్యూఢిల్లీ: రాజకీయాల్లో భారత మాజీ క్రికెటర్ల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ప్రముఖులైన పలువురు క్రికెటర్లు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల్లో చేరారు. మొట్టమొదట మన్సూర్ అలీఖాన్ పటౌడీ రాజకీయాల్లోకి వచ్చారు. దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన భారత తొలి క్రికెట్ ప్లేయర్గా ఆయన గుర్తింపు దక్కించుకున్నారు. అయితే వరుసగా రెండు లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన.. ఆ రెండు సార్లు ఓటమి పాలయ్యారు. దాంతో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం గౌతం గంబీర్, నవజ్యోత్సింగ్ సిద్ధూ, మహ్మద్ ఖైఫ్, మనోజ్ తివారీ, మహ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్, చేతన్ చౌహాన్, వినోద్ కాంబ్లీ లాంటి ప్రముఖ మాజీ క్రికెటర్లు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరనున్నాడు. మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దినేశ్ మోంగియా ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారు.