డెహ్రాడూన్: ఏనుగు బారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఒక మాజీ సీఎం కొండ రాయిపైకి ఎక్కారు. ఆయన కాన్వాయ్ను ఏనుగు అడ్డుకోవడంతో చాలా సేపు అక్కడే ఉన్నారు. ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బుధవారం సాయంత్రం 5-6 గంటల మధ్య కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా పౌరీ నుంచి కోట్ద్వార్కు కాన్వాయ్లో వెళ్తున్నారు. అయితే ఆ అటవీ ప్రాంతం నుంచి ఒక ఏనుగు ఒక్కసారిగా హైవే పైకి వచ్చింది. త్రివేంద్ర సింగ్ రావత్ వాహనాల కాన్వాయ్ను అది అడ్డుకుంది. ఆ ఏనుగు తమ వద్దకు రావడాన్ని గమనించిన రావత్, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల నుంచి కిందకు దిగారు. ఏనుగు బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అక్కడున్న ఒక కొండరాయిపైకి ఎక్కారు.
మరోవైపు ఆ ఏనుగు చాలా సేపు అక్కడే ఉండటంతో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్ అర గంట పాటు అక్కడే నిలిచిపోయింది. దీంతో ఆ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి రోడ్డుపై ఉన్న ఏనుగును అడవిలోకి వెళ్లగొట్టారు. దీంతో త్రివేంద్ర సింగ్ రావత్ ఊపిరి పీల్చుకున్నారు. తన కాన్వాయ్లో అక్కడి నుంచి ముందుకుసాగారు.
కాగా, ఏనుగు బారి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, ఆయన భద్రతా సిబ్బంది కొండ రాయిపైకి ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Uttarakhand: Elephant came in front of former Chief Minister #TrivendraSinghRawat's convoy on the way to Kotdwar and Pauri, Rawat hiding among the hills to save his life. pic.twitter.com/vrsMc4eUpB
— Yazhini (@Yazhini_11) September 15, 2022