న్యూఢిల్లీ: న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కంటే మెరుగైన వ్యవస్థ మరేదీ లేదని మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ మనుగడ సాగించేలా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో ‘న్యాయ నియామకాలు, సంస్కరణలు’ అంశంపై ప్రసంగిస్తూ కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియను ఎలాంటి లోపాలు లేని విధంగా రూపొందించారని వివరించారు. గత కొంతకాలంగా కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో జస్టిస్ లలిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.