న్యూఢిల్లీ: భారత్కు వచ్చే విదేశీయులు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను భారత ప్రభుత్వం సడలించింది. 99 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలు తొలగిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రజలు పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకొని ఉంటే చాలు.
వీరు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ జాబితాలో యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, స్పెయిన్, ఆస్ట్రేలియా, బెల్జియం, బంగ్లాదేశ్, ఫిన్ల్యాండ్, క్రొయేషియా, హంగేరి, రష్యా, ఖతర్, సింగపూర్, శ్రీలంక, నేపాల్ తదితర దేశాలున్నాయి.
ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు కొన్ని కరోనా నిబంధనలు అమలు చేస్తే సరిపోతుంది. అదే సమయంలో పది దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు మాత్రం మరిన్ని కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. యూకే, బంగ్లాదేశ్, జింబాబ్వే దేశాలు ఈ రెండు జాబితాల్లో ఉండటం గమనార్హం.
అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్లో ప్రవేశించిన తర్వాత ఎయిర్పోర్టు వీడేందుకు వీరికి అనుమతి ఉంది. కానీ వ్యక్తిగతంగా ఎవరికీ వారే తమపై 14 రోజుల పాటు పర్యవేక్షణ ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం పేర్కొన్న 99 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
ఒకవేళ ఈ కాలంలో కరోనా లక్షణాలు కనిపించినా, టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలినా వెంటనే సంబంధితన వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, లేదంటే జాతీయ హెల్ప్లైన్ నంబరు 1075కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.