Arindam Bagchi | ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ – కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించారు. ఆ తర్వాత దౌత్యవేత్తలను బహిష్కరించింది. అయితే, దీనిపై సైతం భారత్ ఘాటుగానే స్పందించింది. కెనడా దౌత్యవేత్తను సైతం బహిష్కరించగా.. తాజాగా వీసా సేవలను సైతం నిలిపివేసింది. అక్కడ ఉన్న భారతీయులకు అప్రమత్తంగా ఉండాలంటూ అలెర్ట్ను జారీ చేసింది.
అయితే, తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కెనడాపై గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రుడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని కొట్టిపడేశారు. నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని ట్రుడో చేసిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
కెనడాలో జరుగుతున్న వ్యవహారాలపై భారత్ అనేక లిఖిత పూర్వకంగా పత్రాలను సమర్పించిందని, అక్కడ ఆశ్రయం పొందుతున్న ఖలిస్తాన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. భద్రతా సమస్యల కారణంగా వీసా సేవలకు ఆటంకం ఏర్పడిందని, దీంతో భారత హైకమిషన్ , కాన్సులేట్లు తాత్కాలికంగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయలేకపోయాయని తెలిపారు. కెనడియన్ పౌరులు వీసా సేవలు పొందలేరని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీసా సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.