న్యూఢిల్లీ, మే 26: దేశీయ బొగ్గు సరఫరాలో తమ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం రాష్ర్టాల అధికారాలను హరిస్తున్నదని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) ఆరోపించింది. విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని రాష్ర్టాలను బలవంతం చేస్తున్నదని విమర్శించింది. కేంద్రంలోని బొగ్గు, రైల్వే, విద్యుత్తు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే దేశంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని ఆరోపించింది. దేశంలోని అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు తాము వాడే బొగ్గులో కనీసం 10% బొగ్గును విదేశాల నుంచి తప్పక దిగుమతి చేసుకోవాలని, ఇది అక్టోబర్ దాకా కొనసాగుతుందని విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఈ నెల మొదట్లో రాష్ర్టాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇందుకోసం విద్యుత్తు చట్టంలోని సెక్షన్ 11ను అమల్లోకి తీసుకువచ్చారు. అయితే, సెక్షన్ 11 విధింపులో కేంద్రానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని ఏఐపీఈఎఫ్ అధికార ప్రతినిధి వీకే గుప్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని థర్మల్ కేంద్రాలపై సెక్షన్ 11 విధింపు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని తెలిపారు. కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయని, పరిశ్రమలకు కూడా విద్యుత్తు డిమాండ్ పెరుగుతుందని వీకే గుప్తా అన్నారు. అదే సమయంలో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొన్నారు. మరో విద్యుత్తు సంక్షోభం ముందు ఉందని హెచ్చరించారు.
కేంద్రానిదే బాధ్యత
విదేశాల నుంచి బొగ్గును కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్నవాటితో సహా అన్ని థర్మల్ ప్లాంట్లకు సరఫరా చేయాలని, ఈ బాధ్యతను తప్పక తీసుకోవాలని ఏఐపీఈఎఫ్ డిమాండ్ చేసింది. కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న బొగ్గుకు ఏ ధర ఉందో ఆ రేటుకే రాష్ర్టాలకు సరఫరా చేయాలని కోరింది. అదనపు భారాన్ని కేంద్రమే భరించాలని పేర్కొన్నది. కేంద్రప్రభుత్వం విధా న లోపాల వల్లనే సంక్షోభం తలెత్తిన కారణంగా భారాన్ని కూడా కేంద్రమే మోయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐపీఈఎఫ్ కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్కు లేఖ రాసింది.