న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్, లఢఖలలోని తమతమ పరిధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను భారత ఆర్మీలోని ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్కు ప్రభుత్వం ఉత్తమ యుద్ధసేవా పతకాలను ( Uttam Yudh seva Medals ) ప్రకటించింది. 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్కు, 15 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండేకు ఈ ఉత్తమ యుద్ధ సేవా పతకాలను దక్కాయి. బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఆరుగురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ఆరుగురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను ( Shaurya Chakra awards ) ప్రకటించింది. వారిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. గత జూలైలో జమ్ముకశ్మీర్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మద్రాస్కు చెందిన నాయిబ్ సుబేదార్ శ్రీజిత్ ఒక ఉగ్రవాదిని కాల్చిచంపి తనూ ప్రాణాలు కోల్పోయాడు. ఈయనకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు ప్రకటించారు.
ఇక, 2020 డిసెంబర్లో రాజ్పుత్ రెజిమెంట్కు చెందిన హవల్దార్ అనిల్ కుమార్ తోమర్ ఒక యాక్షన్ టీమ్కు కమాండర్గా వ్యవహరిస్తూ ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈయనకు కూడా మరణానంతరం శౌర్యచక్ర అవార్డు దక్కింది. మరో హవల్దార్ కాశీరాయ్ బమ్మనహళ్లి కూడా ఒక ఉగ్రవాదిని కాల్చిచంపి తనూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో తన కమాండర్ ప్రాణాలు కాపాడాడు. ఆయనకు కూడా మరణానంతరం శౌర్య చక్ర అవార్డును ప్రకటించారు.
పారిపోతున్న ఉగ్రవాదులను అడ్డగించి వారిపై కాల్పులు జరిపినందుకు జాట్ రెజిమెంట్కు చెందిన హవల్దార్ పింకూ కుమార్కు మరణానంతరం శౌర్యచక్ర అవార్డు దక్కింది. పింకూకుమార్ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా, మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పింకూకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా తెలుగువాడైన సిపాయి మారుప్రోలు జశ్వంత్ కుమార్ రెడ్డికి కూడా మరణానంతరం శౌర్యచక్ర అవార్డును ప్రకటించారు. జమ్ముకశ్మీర్లో జరిగిన ముఖాముఖి కాల్పుల్లో ఈయన ఒక ఉగ్రవాదిని హతమార్చాడు.
ఉగ్రవాదుల కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి కూడా మరణించాడు. ఈ క్రమంలో జశ్వంత్ తమ టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడాడు. అదేవిధంగా అసోంలో ఇద్దరు చొరబాటుదారులను తుదముట్టించినందుకు 5 అసోం రైఫిల్స్కు చెందిన రైఫిల్ మ్యాన్ రాకేష్ శర్మకు శౌర్య చక్ర అవార్డు ప్రకటించారు.