Water resources | న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలోనే తొలిసారిగా కేంద్రం జలగణన సర్వేను చేపట్టింది. దేశవ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లు, ట్యాంకులు, సరస్సులు తదితర జలవనరులు ఎన్ని ఉన్నాయన్న దానిపై కేంద్ర జలశక్తి సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. ఈ జలగణన వివరాలను కేంద్ర జలశక్తి శాఖ తాజాగా మీడియాకు విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలో మొత్తం 24,24,540 నీటి వనరులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 97.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.9 శాతం మేరకు విస్తరించాయి.
మొత్తం నీటి వనరుల్లో అత్యధిక భాగం (59.5 శాతం) నీటి కొలనులు, సరస్సులు, చెరువుల్లో విస్తరించి ఉన్నాయి. 15.7 శాతం నీటి ట్యాంకులు, 12.1 శాతం రిజర్వాయర్లు, 9.3 శాతం చెక్డ్యాములు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యంలో 55.2 శాతం, ప్రభుత్వ ఆధీనంలో 44.8 శాతం నీటి వనరులున్నట్టు లెక్క తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కొలనులు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయని, పట్టణాల్లోనూ ఆ మేరకు ఆక్రమణలున్నాయని సర్వే గుర్తించింది.