Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ సీఎం పగ్గాలు మళ్లీ యోగి ఆదిత్యనాథ్ చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ప్రమాణం చేస్తే ఆ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి పలు రికార్డులను ఆయన బ్రేక్ చేయనున్నారు. 71 ఏండ్ల తర్వాత వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేసిన నేతగా యోగి నిలువనున్నారు. ఇంతకుముందు చంద్రభాను గుప్తా, ఎన్డీ తివారీ వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్డీ తివారీ మాత్రం పూర్తి పదవీ కాలంలో కొనసాగలేదు.
1950 మే 20న యూపీ అసెంబ్లీ కొలువుదీరినప్పటి నుంచి ఈ రాష్ట్రం 71 ఏండ్లలో 21 మంది సీఎంలయ్యారు. కానీ బీజేపీకి యోగి ఆదిత్యనాథ్ లక్కీగా నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ ఏడు రికార్డులు నమోదు చేయనున్నారు. యూపీ అసెంబ్లీ చరిత్రలో వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేత కానున్నారు. బీజేపీ నుంచి ఐదేండ్ల పదవీ కాలం పూర్తి చేసిన సీఎం యోగి. ఇంతకుముందు బీజేపీ అధికారంలో ఉన్నా సీఎంగా ఒక్క నాయకుడు అదీ యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఐదేండ్లు కొనసాగారు.
2007లో ములాయం సింగ్ యాదవ్ మాదిరిగా సీఎంగా పోటీ చేసిన తొలి నేత యోగి ఆదిత్యనాథ్. నోయిడాకు వెళ్లిన సీఎం తిరిగి విజయం సాధించలేదని 34 ఏండ్లుగా ప్రచారంలో ఉంది. ఆ రికార్డును కూడా యోగి ఆదిత్యనాథ్ బ్రేక్ చేశారు.
పార్టీని విజయ పథాన నిలిపిన నేతల్లో ఐదవ సీఎం యోగి ఆదిత్యనాథ్. 1957లో సంపూర్ణానంద్, 1962లో చంద్రభాను గుప్తా, 1974లో హెచ్ఎన్ బహుగుణ, తర్వాత ఎన్డీ తివారీ వరుసగా రెండోసారి పార్టీని గెలిపించారు. 15 ఏండ్ల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న తొలి సీఎం యోగి ఆదిత్యనాథ్ కానున్నారు. 2007లో మాయావతి, 2012లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ప్రమాణం చేసినా.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.