అహ్మదాబాద్: ప్రభుత్వ అధికారులుగా నటించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (posing as government officials) ఐపీఎస్ అధికారి వేషధారణలో ఉన్న ఒక నిందితుడు వాహనాలను తనిఖీ చేసి చలాన్లు జారీ చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిగా నమ్మించిట్లు పేర్కొన్నారు. గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సూరత్ పోలీసులు భతేనాలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి వాహనాలు తనిఖీ చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనులకు చలాన్లు జారీ చేసి డబ్బులు వసూలు చేయడాన్ని పోలీసులు గమనించారు. మహ్మద్ సమ్రెజ్గా గుర్తించిన అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, గాంధీనగర్లోని గాంధీధామ్కు చెందిన ఒక కాంట్రాక్టర్ తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కార్యదర్శినని నమ్మించాడు. అక్టోబర్ 14న గాంధీనగర్ పోలీస్ భవన్లో జరిగిన నవరాత్రి కార్యక్రమానికి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఆహ్వానించడానికి నకిలీ విజిటింగ్ కార్డులు ఇచ్చాడు. అనుమానించిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేశారు. నిందితుడ్ని పుణ్య దేవ్ రాయ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ పాలిత గుజరాత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులమని నమ్మిస్తూ పలు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.