అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తన ఇంటికి ఆహ్వానించి ఆయనతో కలిసి డిన్నర్ చేసిన గుజరాత్ ఆటో డ్రైవర్ అనంతరం యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా కాషాయ కండువా కప్పుకున్న అతడు బీజేపీ ర్యాలీలో పాల్గొన్నాడు. మీడియా కంటపడిన ఆ యువకుడు పెద్ద షాక్ ఇచ్చాడు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 13న అహ్మదాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్లో స్థానిక ఆటో డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు.
కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న విక్రమ్ దాంతాని అనే యువ ఆటో డ్రైవర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను భోజనం కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. స్పందించిన ఆయన అందుకు అంగీకరించారు. అనంతరం స్థానిక ఆప్ నేతలతో కలిసి విక్రమ్ ఆటోలో అతడి పేద ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ యువకుడితో కలిసి భోజనం చేశారు.
మరోవైపు శుక్రవారం అహ్మదాబాద్లో జరిగిన ప్రధాని మోదీ సభలో యువ ఆటో డ్రైవర్ విక్రమ్ కనిపించాడు. మెడలో కాషాయ కండువా కప్పుకున్న అతడ్ని మీడియా ప్రశ్నించింది. దీంతో ఆ యువకుడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆటో డ్రైవర్ల సంఘం నేతలు అడిగినందుకే కేజ్రీవాల్ను భోజనం కోసం తన ఇంటికి ఆహ్వానించినట్లు చెప్పాడు. అంతే తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అన్నాడు. ప్రధాని మోదీ అంటే అభిమానమన్న అతడు తాను ఇప్పటి వరకు బీజేపీతో ఉండటంతోపాటు ఆ పార్టీకే ఓటు వేసినట్లు వెల్లడించాడు. అయితే తాను ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చెప్పడం లేదంటూ చివరకు ట్విస్ట్ ఇచ్చాడు.