లక్నో: కొందరు ముస్లిం వ్యక్తులు ఒక ఇంట్లో సామూహికంగా నమాజ్ చేశారు. దీనిపై ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దుల్హేపూర్ గ్రామంలో మసీదు లేదు. మరోవైపు బహిరంగ ప్రార్థనలపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలు ఇటీవల ఒక ఇంట్లోని వరండాలో సామూహికంగా నమాజ్ చేశారు.
కాగా, పొరుగున ఉండే చంద్ర పాల్ సింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘గుంపుగా నమాజ్ చదవడం ద్వారా, ఈ వ్యక్తులు ప్రజల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారు’ అని ఆరోపించాడు. దీంతో సామూహిక నమాజ్లో పాల్గొన్న 26 మంది ముస్లిం వ్యక్తులపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 505-2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 16 మందిని గుర్తించగా మరో పది మందిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి సందీప్ కుమార్ మీనా తెలిపారు.
మరోవైపు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యూపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంట్లో అంతా కలిసి నమాజ్ చేసుకుంటే కూడా కేసు నమోదు చేయడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ‘ఇరుగుపొరుగువారిలో ఒకరు 26 మంది స్నేహితులు, బంధువులతో హోమం నిర్వహిస్తే అది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైంది. గుంపుగా సమావేశం కావడం సమస్య కాదు. నమాజ్ చేసుకోవడమే’ అని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.