న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రక్షణ రంగానికి నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. సాయుధ బలగాల ఆధునీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది 5,25,166.15 కోట్లు కేటాయించారు. ఇందులో 68 శాతం అంటే 1.52 లక్షల కోట్లు దేశీయ వనరుల నుంచి కొనుగోళ్లకు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.1.35 లక్షల కోట్ల కంటే దాదాపు 13 శాతం ఎక్కువ. పార్లమెంట్లో మంగళవారం బడ్జెట్ ప్రవేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రక్షణ రంగంలో స్థానిక పరిశ్రమల కోసం మూలధన సేకరణ బట్జెట్లో 68 శాతం నిధులు ప్రకటించారు. రక్షణ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం మేర నిధులు పెంచగా ఈసారి మరో పది శాతం అదనంగా కేటాయించారు.
రక్షణ పరికరాల దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద మరింత ‘స్వయం-ఆధారిత’ రక్షణ రంగాన్ని కలిగి ఉండటం తమ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. “రక్షణ కోసం మూలధన సేకరణ బడ్జెట్లో 68 శాతం దేశీయ పరిశ్రమకు ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించడానికి కేటాయించాం” అని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
అతాగే రక్షణ రంగంలో పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థల కోసం.. రక్షణ పరిశోధన, అభివృద్ధి (R&D) ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఇతర సంస్థలతో కలిసి ప్రత్యేక ప్రయోజన వాహనం (SPV) మోడలను ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా సైనిక ప్లాట్ఫారమ్లు, పరికరాల రూపకల్పన, అభివృద్ధిని చేపట్టేందుకు ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.