కోల్కతా: వర్షాలకు మట్టి ఇంటిని వృద్ధురాలు కోల్పోయింది. సహాయం కోసం ప్రభుత్వ అధికారులను కోరింది. వారు స్పందించకపోవడంతో ప్రభుత్వ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్డిలో ఏడాదిగా నివసిస్తున్నది. (toilet as home for old woman) పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుంద్రాడి గ్రామానికి చెందిన 66 ఏళ్ల మిథిలా మహతో భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. ఆమె కుమార్తెలు వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీంతో గ్రామంలోని మట్టి ఇంట్లో ఒంటరిగా జీవించింది.
కాగా, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు మట్టి ఇంటిని ఆ వృద్ధురాలు కోల్పోయింది. ప్రభుత్వం సమకూర్చిన ప్లాస్టిక్ టెంట్లో కొన్ని రోజులు గడిపింది. అయితే శాశ్వత ఇంటి కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. దీంతో బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం ప్రభుత్వ ప్రచారంలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్డిలో ఏడాదిగా ఆమె నివసిస్తున్నది. మూడడుగల ఆ టాయిలెట్లోనే అతి కష్టంగా నిద్రిస్తున్నది.
మరోవైపు ఈ విషయం మీడియాకు తెలిసింది. దీంతో గ్రామ సర్పంచ్తోపాటు స్థానిక అధికారులు స్పందించారు. తాత్కాలిక సహాయంగా టెంట్ సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆమెకు లబ్ధి చేకూరకపోవడంపై టీఎంసీ, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శించుకున్నారు. అయితే ఈ పథకానికి ఆమె దరఖాస్తు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.