న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతున్నది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ వచ్చే నెల నుంచి జపాన్లోని టోక్యోలో రోబోలతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నది. ఇందుకోసం మిత్సుబిషి ఎలక్ట్రిక్ అండ్ కార్ట్కెన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అటానమస్ సైడ్వాక్ రోబోలను కార్ట్కెన్కు చెందిన మోడల్ సీ నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో రోబోలతో ఫుడ్ డెలివరీ చేయించడం ఇదే తొలిసారి కానుంది. నిజానికి జపాన్లో రోబోల వాడకం కొత్తేమీ కాదు. ఏళ్ల తరబడి ఇక్కడి రెస్టారెంట్లలో ఇవి సేవలు అందిస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడివి వీధుల్లో పుడ్ డెలివరీ చేస్తూ కనిపించడమే కొత్త వింత కాబోతున్నది. ఫుడ్ డెలివరీ చేసే ఈ రోబోలు పాదచారులు నడిచే దారినే ఎంచుకుంటాయి. ట్రాఫిక్ సిగ్నళ్లను పాటిస్తాయి. అయితే, ఇవి నడుచుకుంటూ వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తే పుణ్యకాలం కాస్తా గడిచిపోయి ఆహారం చల్లారిపోదా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కార్గోబిన్ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. వీటిలో ఆహారం సరఫరా చేస్తే అప్పుడు వండినట్టుగానే ఉంటుందట!