పాట్నా: బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి ఎట్టకేలకు ప్రభుత్వ అధికార బంగ్లాను ఖాళీ చేశారు. బీజేపీ ప్రభుత్వం పలు నోటీసులు జారీ చేయడంతో 20 ఏళ్లుగా నివసిస్తున్న పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ బంగ్లాను గురువారం ఆమె కుటుంబం వీడింది. (Rabri Devi Vacates Bungalow) రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి కుటుంబం సుమారు 20 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వ బంగ్లాలో నివసించారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో, ఆ తర్వాత కూడా ఆ రాష్ట్రంలో అత్యంత ప్రముఖ రాజకీయ చిరునామాలలో ఒకటిగా ఈ బంగ్లా నిలిచింది.
కాగా, బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మారాయి. పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్కు ‘10 సర్క్యులర్ రోడ్’ నివాసాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మే 27న భవన నిర్మాణ శాఖ ఆ బంగ్లాను మంత్రికి కేటాయించింది.

Rabri Devi Vacates Bungalow
మరోవైపు హార్డింగ్ రోడ్లోని హౌస్ నెం. 39ను రబ్రీ దేవికి అధికారిక నివాసంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ‘10 సర్క్యులర్ రోడ్’ నివాసాన్ని ఖాళీ చేయాలని కోరుతూ రబ్రీ దేవి, ఆమె కుటుంబానికి నాలుగు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ బంగ్లాను ఖాళీ చేయబోనని రబ్రీ దేవి భీష్మించారు.
కాగా, బీహార్ ప్రభుత్వం విధించిన గడువు జూన్ 29తో ముగిసింది. గడువును జూలై 5 వరకు పొడిగించాలని రబ్రీ దేవి కోరారు. అయినప్పటికీ గురువారం ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. కౌటిల్య నగర్లోని తమ కొత్త నివాసానికి మారారు. దీంతో లాలూ కుటుంబం దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగిన ఆ ప్రముఖ నివాసంతో వారి అనుబంధానికి తెరపడింది. అలాగే లాలూ ప్రసాద్, బీహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకురాలైన రబ్రీ దేవి భద్రతను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది.