న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తన ఫాలోవర్స్ను ఆ సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వత్తడి చేయడం వల్ల తన స్వరాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు లేఖ కూడా రాశారు. మోదీ సర్కార్ వత్తడి చేయడం వల్ల ట్విట్టర్ తన ఫాలోవర్లను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ లేఖలో రాహుల్ పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ చేసిన ఓ ట్వీట్ను కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. భారత్లో భావ స్వేచ్ఛను ట్విట్టర్ నియంత్రిస్తున్నట్లు రాహుల్ తన లేఖలో సీఈవో పరాగ్కు తెలిపారు. ప్రస్తుతం రాహుల్కు ట్విట్టర్లో 19.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో 8 రోజుల పాటు రాహుల్ ట్విట్టర్ సస్పెండ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి రాహుల్ను ఫాలో అయ్యేవారి సంఖ్యం క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విట్టర్ సంస్థ స్పందించింది. రాహుల్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది.
తగ్గొచ్చు.. పెరగొచ్చు..
రాహుల్ గాంధీ లెటర్కు కౌంటర్ ఇచ్చిన ట్విట్టర్.. ఫాలోవర్ కౌంట్ అనేది విజిబుల్ ఫీచర్ అని, నెంబర్ల విషయంలో నమ్మకం ఉండాలని, అవన్నీ వాస్తవ సంఖ్యలే అని సోషల్ మీడియా సంస్థ తెలిపింది. తన ట్విట్టర్ ద్వారా రిప్లై ఇస్తూ.. తమ ప్లాట్ఫామ్లో ఎటువంటి అవకతవకలు జరగవని, జీరో టాలరెన్స్ ఉంటుందని, స్పామ్ ఉండదని పేర్కొన్నది. తమ ప్లాట్ఫామ్లో అవకతవకలకు పాల్పడే వారికి చెందిన మిలియన్ల అకౌంట్లను ప్రతి వారం డిలీట్ చేస్తూనే ఉంటామని ట్విట్టర్ చెప్పింది. ట్విట్టర్ ట్రాన్స్పరెన్సీ సెంటర్లో దానికి సంబంధించి అప్డేట్ చూసుకోవచ్చు అని సూచించింది. కొన్ని అకౌంట్లలో మాత్రం స్వల్ప తేడాను గమనించవచ్చు అని ట్విట్టర్ తెలిపింది. స్పామ్, ఆటోమేషన్ పొరపాట్లను వ్యూహాత్మకంగా డీల్ చేయనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. దీర్ఘకాలంలో ఫాలోవర్ల కౌంట్ అనేది ఒడిదిడుకులకు లోనవుతుందని ట్విట్టర్ స్పష్టం చేసింది.