పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav ) మరోసారి వార్తల్లో నిలిచారు. జానపద కళాకారులు విలువైన తన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. హోలీ రోజున పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో రూ.5 లక్షల విలువైన వస్తువులను వారు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు.
కాగా, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అనుచరుడు మిసాల్ సిన్హా ఈ నెల 10న సచివాలయం పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు హోలీ సందర్భంగా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసానికి వచ్చి ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత తేజ్ ప్రతాప్కు చెందిన రూ.5 లక్షల విలువైన వస్తువులు మాయమయ్యాయని చెప్పారు. ఈ వస్తువుల గురించి ఆ కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అనుచరుడు మిసాల్ సిన్హా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సచివాలయం పోలీస్ స్టేషన్ అధికారి భగీరథ ప్రసాద్ తెలిపారు. అయితే బృందావనం జానపద కళాకారులు ఏ వస్తువులు చోరీ చేశారో అన్నది ఆ ఫిర్యాదులో పేర్కోలేదని అన్నారు. ఈ చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.