న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో పాటు ఆర్ధిక శాఖ బాధ్యతలనూ చేపట్టిన సీఎంలు హాజరయ్యారు.
భేటీలో చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. జీఎస్టీ పరిహారం చెల్లించాలని, కోల్ బ్లాక్ కంపెనీల నుంచి వసూలు చేసిన అదనపు లెవీ బదలాయింపుతో పాటు, నక్సలిజం అణిచివేతకు రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన రూ 15,000 కోట్లను తమకు సమకూర్చాలని ఈ సమావేశంలో చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ కేంద్రాన్ని కోరారు.
ఈ మొత్తాన్ని తమకు తిరిగి చెల్లించేలా రానున్నన బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నక్సలిజం అణిచివేతకు చత్తీస్ఘఢ్లో కేంద్ర బలగాలపై తాము రూ 15,000 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపును మరో ఐదేండ్లు పొడిగించాలని కోరారు.