కొట్టాయం/ఇడుక్కి, అక్టోబర్ 16: కేరళలో శనివారం కుండపోత వానలు, పోటెత్తిన వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు కొట్టాయం, ఇడుక్కి జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని రెండు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీయవలసి ఉంది. ఈ రెండు గ్రామాలు కూటిక్కల్, పెరువంతనం కొండప్రాంతంలో ఉంటాయి. నది పొంగడంతో ఈ గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలువురు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఇడుక్కి జిల్లా కంజర్లో ఓ కారు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దాంట్లో ప్రయాణిస్తున్న 30 ఏండ్ల మహిళ, పురుషుడు మరణించారు. వారి మృతదేహాలను వెలికితీశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి తీవ్రంగా ఉందని సీఎం పినరాయి విజయన్ అన్నారు. పోలీసు, అగ్నిమాపక దళానికి చెందిన సహాయ బృందాలు వరద ఉద్ధృతి, వాతావరణ పరిస్థితి అనుకూలించక ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం… ఆర్మీ, ఎయిర్ఫోర్స్ను సాయం కోరింది. ఎంఐ-17, సారంగ్ హెలికాప్టర్లను సహాయ చర్యల కోసం కేటాయించామని, వరద ప్రభావిత ప్రాంతాలకు ఆర్మీ సిబ్బందిని నియోగించామని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానల వల్ల కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. కొట్టాయం జిల్లాలో వరదలో చిక్కుకున్న కేఎస్ఆర్టీసీ బస్సు నుంచి ప్రయాణికులను స్థానికులు కాపాడారు.