హైదరాబాద్, ఆగస్టు 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హిమాచల్ప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో భారీ నిర్మాణాలు, భవంతులు పేక మేడల్లా కూలి నీటిలో కొట్టుకుపోతున్నాయి. తాజాగా కులు జిల్లాలో కురిసిన ఎడతెరిపిలేని వానలకు వరద పోటెత్తింది. దీంతో జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్తు కేంద్రంలోని కాఫర్ డ్యామ్ ఒకటి కొట్టుకుపోయింది. ఆనకట్ట సమీపంలో నిలిపి ఉంచిన భారీ యంత్రాలు, డంపర్ ట్రక్కు, రాక్ బ్రేకర్, క్యాంపర్ వంటి వాహనాలు కూడా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటికైతే ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు రానప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం కోట్లల్లోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలోనూ ఆ పార్టీదే అధికారం. దీంతో దివాలా అంచున ఉన్న హిమాచల్ను ఒడ్డున పడేయడానికి ఇక్కడి రేవంత్ ప్రభుత్వం ఉబలాటపడుతున్నది. దీని కోసం రూ. 6,200 కోట్లు ఖర్చుపెట్టి హిమాచల్లో రెండు 510 మెగావాట్ల జల విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధపడుతున్నది. ఈ మేరకు గత మేలో హిమాచల్ ప్రభుత్వంతో రేవంత్ సర్కారు ఎంవోయూ కుదుర్చుకొన్నది. ఈ డీల్లో ఏదో చీకటి కోణమున్నదని, ఇప్పటికే రూ. 50 కోట్ల మేర చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్తున్నది. అయితే, ప్రతిపాదిత ప్లాంట్లు నిర్మించబోతున్న ప్రాంతం, ప్రస్తుతం కొట్టుకుపోయిన కాఫర్ డ్యామ్ ప్రాంతానికి సమీపంలోనే ఉన్నదని తెలుస్తున్నది.
రేవంత్ ప్రభుత్వం సెలి, మియార్లో నిర్మించాలనుకొంటున్న రెండు విద్యుత్తు ప్లాంట్లు లాహౌల్-స్పితి జిల్లా పరిధిలోకి వస్తాయి. కులు జిల్లా లాహౌల్-స్పితికి పొరుగునే ఉంటుంది. కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన ప్రాంతానికి, తెలంగాణ సర్కారు నిర్మించబోతున్న విద్యుత్తు ప్లాంట్ల ప్రాంతం సమీపంలోనే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వరద ప్రమాదం పొంచి ఉన్న ఇలాంటి ప్రాంతంలో, అనువుగాని చోట, టూవీలర్ కూడా ప్రయాణించలేని స్థలంలో రేవంత్ ప్రభుత్వం విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు రావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్లాంట్లను నిర్మించలేక మోసర్ బేర్, ఎన్టీపీసీ వంటి దిగ్గజ కంపెనీలే గతంలో చేతులెత్తేశాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ, రేవంత్ ప్రభుత్వం మొండిగా ప్లాంట్ల నిర్మాణానికి ముందుకువెళ్తే, తెలంగాణకు చెందిన వేల కోట్ల ప్రజా సంపద హిమాచల్ వరదల్లో కలిసే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.