గువాహటి, జూన్ 18: అస్సాం రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 జిల్లాల్లోని సుమారు 37 వేల మంది వరదల వల్ల నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. జోర్హాట్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది రెడ్ మార్క్ ప్రమాద హెచ్చరికను తాకుతూ ప్రవహిస్తున్నది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోక్రాజర్, చిరాంగ్, బక్సా, బార్పెటా, బొన్గయిగాన్ తదితర జిల్లాల్లో 20 సెం.మీ వర్షం కురిసే ఆస్కారం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.