న్యూఢిల్లీ: ఈ నెల తొలి వారం దేశ రాజధాని ఢిల్లీలో పదో తరగతి బాలికపై యాసిడ్ దాడి జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. పోలీసుల ఇంటరాగేషన్లో నిందితుడు యాసిడ్ను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దాంతో ఢిల్లీ పోలీసులు ఈ నెల 15న ఫ్లిప్ కార్ట్ అధికారులకు నోటీసులు జారీచేశారు.
ఢిల్లీలో యాసిడ్ అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం ఉన్నప్పటికీ నిందితుడికి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా యాసిడ్ను ఎందుకు విక్రయించారని ఆ నోటీసులలో ప్రశ్నించారు. ఘటనకు సంబంధించి ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దాంతో ఫ్లిప్ కార్ట్ అధికారులు బుధవారం ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
ఆగ్రాకు చెందిన ఓ కంపెనీ తమ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో యాసిడ్ అమ్ముతున్నదని, ఢిల్లీకి చెందిన కస్టమర్ యాసిడ్ కోసం ఆర్డర్ చేయడంతో ఆ కంపెనీ నుంచి అతనికి యాసిడ్ డెలివరీ ఇచ్చామని చెప్పారు. అయితే, ఫ్లిప్ కార్ట్ అధికారుల సమాధానంతో ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదు. దాంతో వాళ్లను మరోసారి పిలిచి విచారించాలని నిర్ణయించారు.