Flights to Kullu-Dharamshala | కరోనా సమయంలో నిలిచిపోయిన కులు, ధర్మశాల విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 9 నుంచి ఈ రెండు ప్రదేశాలకు అలయన్స్ ఇండియా తన విమాన సర్వీసులను నడిపేందుకు సర్వం సిద్ధం చేసుకున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం పొందిన తర్వాత అలయన్స్ ఇండియా కులు-ధర్మశాలకు తన విమాన సర్వీసుల షెడ్యూల్ను నిర్ణయించింది.
డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు తర్వాత హిమాచల్ప్రదేశ్లోని ఈ రెండు పర్యాటక ప్రదేశాలకు ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవనున్నాయి.
కరోనా కారణంగా కులు-ధర్మశాల పర్యాటక ప్రదేశాలకు గత మూడేండ్లుగా విమానసర్వీసులు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం అనంతరం హిమాచల్ సిమ్లా, భుంతర్, ధర్మశాలలోని 3 పర్యాటక ప్రదేశాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెప్టెంబరు నెలలో సిమ్లాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే, కులు-ధర్మశాలలో విమాన సేవలకు అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా మరో రెండు నెలల పాటు అంతరాయం ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం డిసెంబర్ 9 నుంచి కులు-ధర్మశాలకు విమానాలను అలయన్స్ ఇండియా నడిపేందుకు నిర్ణయించింది.
డిసెంబర్ నెలలో రాష్ట్రంలో టూరిజం సీజన్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో హిమాచల్లో ఎయిర్ కనెక్టివిటీ పెరుగుదల పర్యాటక వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్వతాలపై హిమపాతాన్ని వీక్షించేందుకు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులకు అండగా నిలిచేందుకు హిమాచల్ప్రదేశ్ పర్యాటక శాఖ అలయన్స్ ఎయిర్ కంపెనీతో
2022 సెప్టెంబర్లో ఎంఓయూ కుదుర్చుకున్నది. దీంతో త్వరలో కులు-ధర్మశాలకు ప్రత్యేక ప్యాకేజీ టూర్లు ప్రారంభంకానున్నాయి.