న్యూఢిల్లీ: ఇండియా-బ్రిటన్ మధ్య విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర సగటున 25-45 వేల రూపాయలు. కానీ ఈ ఆగస్టు నెలలో అదే టికెట్ కొనాలంటే కనీసం రూ.1.03 లక్షలు చెల్లించాల్సిందే. ఆగస్టు 26న అయితే ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం టికెట్ ధర రూ.3.95 లక్షలు. కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని అంతర్రాష్ట్ర మండలి సచివాలయం కార్యదర్శి సంజీవ్ గుప్తా ఈ మేరకు ట్వీట్ చేశారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై కొన్ని దేశాలు ఆంక్షలు సడలించాయి. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు అక్కడ దిగగానే 10 రోజులు హోటల్లో క్వారంటైన్లో ఉండాలన్న నిబంధనను బ్రిటన్ ఆదివారం నుంచి సడలించింది. మరోవైపు, పరిమిత సంఖ్యలోనే సర్వీసులు ఉండటంతో డిమాండ్ విపరీతంగా ఉంటున్నది. ఆగస్టులో ఇండియా, బ్రిటన్ మధ్య వారానికి కేవలం 30 విమానసర్వీసులను మాత్రమే నడవనుండటంతో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. బ్రిటన్కు వెళ్లే విమానాలకు ఇంత డిమాండ్ ఉండటానికి కారణం అక్కడ విద్యాసంస్థల్లో ఆగస్టు నుంచే అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి. బ్రిటన్తో పాటు ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్, ముంబై నుంచి దోహా వంటి కీలక రూట్లలోనూ పరిస్థితి ఇలాగే ఉన్నదని EaseMyTrip.com వెల్లడించింది.