న్యూఢిల్లీ: ఒక వ్యక్తి విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పలు చోట్ల తనిఖీ చేశారు. అతడి బ్యాగులు చెక్ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ వ్యక్తి సంబంధిత విమానంలో ప్రయాణించలేదు. దీని గురించి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు (human trafficking) బయటపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. దిల్జోత్ సింగ్ బుధవారం ఎయిరిండియా విమానంలో బ్రిటన్లోని బర్మింగ్హామ్కు వెళ్లాల్సి ఉంది. ఎయిర్పోర్ట్లో అతడి కదలికలపై అనుమానం రావడంతో టెర్మినల్ 3 వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తితోపాటు అతడి బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతడి వద్ద అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.
కాగా, బ్రిటన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానాన్ని దిల్జోత్ సింగ్ ఎక్కలేదు. ఈ విషయం తెలిసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. విమానంలో ప్రయాణించకపోవడం గురించి అతడ్ని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడి కదలికలను పరిశీలించారు. ఇమిగ్రేషన్ అధికారులు ప్రయాణ ప్రతాలపై అనుమానం వ్యక్తం చేసినట్లు గ్రహించారు. అయితే ఆ వ్యక్తి చెక్ ఇన్ కౌంటర్ వద్దకు వెళ్లలేదని తెలుసుకున్నారు.
మరోవైపు దీని గురించి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎయిర్ ఇండియాకు చెందిన కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోహన్ వర్మ మరో కౌంటర్ వద్ద తప్పుడు పత్రాల ఆధారంగా చెక్-ఇన్ ఫార్మాలిటీ పూర్తి చేసినట్లు తెలిసింది. రూ.80,000 కోసం సహచర ఉద్యోగి మహ్మద్ జహంగీర్ సూచన మేరకు అన్నింటిని మాన్యువల్గా పూర్తి చేసినట్లు ఎయిర్లైన్ సిబ్బంది రోహన్ వర్మ ఒప్పుకున్నాడు.
కాగా, రాకేష్ అనే వ్యక్తి తనకు రూ. 40,000 ఆఫర్ చేశాడని జహంగీర్ చెప్పాడు. మరో ఇద్దరు ఉద్యోగులు యాష్, అక్షయ్ నారంగ్ కూడా తమ ప్రమేయాన్ని అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు సిబ్బంది, ఆ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. దీంతో మానవ అక్రమ రవాణాకు ప్రయత్నించినట్లు అనుమానించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.