ఇంఫాల్, ఆగస్టు 5: జాతుల మధ్య వైరంతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో బిష్ణుపూర్, చురాచాంద్పూర్ జిల్లాల్లో ఐదుగురు మరణించారు. మృతిచెందిన వారిలో ముగ్గురు మైతీలు, ఇద్దరు కుకీలు ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మైతీలు అధికంగా ఉండే బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా, కుకీలు అధికంగా ఉండే చురాచాంద్పూర్లోని పోల్జాంగ్లలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగినట్టు తెలుస్తున్నది. ఘర్షణలకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని, అయితే వారే మొదట దాడులు చేశారంటూ మైతీలు, కుకీలు పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నాయని అధికారులు తెలిపారు.
నిద్రిస్తుంటే కాల్చి చంపారు..
శుక్రవారం రాత్రి క్వాక్టా గ్రామంలో తండ్రీ, కుమారుడితో సహా ముగ్గురిని మిలిటెంట్లు హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ముగ్గురిని కాల్చిచంపారని, ఆ తర్వాత మృతదేహాలను కత్తులతో నరికేశారని పేర్కొన్నారు. సహాయ శిబిరాల్లో తలదాంచుకొంటున్న ఈ ముగ్గురు.. ఇటీవలే క్వాట్టాలోని తమ ఇండ్లకు వచ్చారని తెలిపారు. ముగ్గురి హత్య గురించి తెలుసుకొన్న గ్రామస్తులు అనంతరం చురాచాంద్పూర్ వైపుగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకొన్నారు. ఈ హత్యలకు ప్రతీకారంగా బిష్ణుపూర్ జిల్లా ఉఖా తంపక్లోని పలు ఇండ్లకు దుండగులు నిప్పుపెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గురువారం రెండు జిల్లాల మధ్యన ఉండే తోర్బాంగ్ ఏరియాలో 35 కుకీల మృతదేహాలకు సామూహిక ఖననం చేపట్టేందుకు చేసిన ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతలు రేపిన విషయం తెలిసిందే.
కర్ఫ్యూ సడలింపు తగ్గింపు..
మరోవైపు క్వాక్టా గ్రామంలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇంఫాల్ లోయ వ్యాప్తంగా మహిళా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. టైర్లు కాల్చి, వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. తాజా హింస నేపథ్యంలో జంట ఇంఫాల్ జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూను కట్టుదిట్టం చేశారు. ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. 27 అసెంబ్లీ నియోజకవవర్గాల కోఆర్డినేటింగ్ కమిటీ శనివారం చేపట్టిన 24 గంటల బంద్తో ఇంఫాల్ వ్యాలీలో సాధారణ జనజీవనం స్తంభించింది.