కేంద్ర వ్యవసాయ చట్టాలపై పోరాటంలో పంజాబ్ రైతుల పాత్ర మరువలేనిది. ఈ చట్టాలను కేంద్రం రద్దు చేసినప్పటికీ పోరాటంలో వందలాది అన్నదాతలు ప్రాణాలు కోల్పోవడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై రైతుల ప్రభావం స్పష్టంగా కనిపించనున్నది.
పంచనదులు (సట్లెజ్, రావి, బియాస్, చీనాబ్, జీలం)పారుతున్న పంజాబ్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొన్నది. దశాబ్దాలుగా అకాలీదళ్, కాంగ్రెస్ అధికారం కోసం పోటీ పడుతుండగా గతేడాది అనూహ్యంగా 20 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొచ్చింది. మాజీ సీఎం అమరిందర్ కొత్త పార్టీ, కొత్తగా రైతులు ఎన్నికల క్షేత్రంలోకి రావడంతో పంజాబ్లో అధికారం కోసం ఐదు పార్టీలు/కూటములు పోటీ పడుతున్నాయి. దశాబ్దాలుగా బీజేపీతో పొత్తులో ఉన్న ఆకాలీదళ్ బీజేపీని దూరం పెట్టడం ఈ ఎన్నికలకున్న మరో ప్రత్యేకత. ఈసారి బీజేపీ అమరిందర్ కొత్త పార్టీ అయిన పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్సీ), శిరోమణి అకాలీదళ్(యునైటెడ్)లతో పొత్తు పెట్టుకొన్నది. పంజాబ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కథనం.
శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తులో ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ సొంతంగా బరిలో ఉన్నాయి. వివాదాస్పద సాగు చట్టాల నేపథ్యంలో ఈ సారి పంజాబ్ రైతులు కూడా పొలాల నుంచి ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెట్టారు. 22 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త సమాజ్ మోర్చా బల్బీర్ సింగ్ రాజేవాల్ నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. సంయుక్త సంఘర్షణ్ పార్టీతో పొత్తు పెట్టుకొన్నది. కరోనా నేపథ్యంలో ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కానీ అంతకుముందే కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్ అప్పటికే తమ ప్రచారాన్ని సగం ముగించాయి. ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ కూటమి కనీసం ఒక్క సభ కూడా నిర్వహించలేదు. ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని రాజకీయంగా వాడుకొందామనుకొన్న ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.
ముందంజలో ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లతో పంజాబ్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ సారి పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. తమ సీఎం అభ్యర్థిగా.. చన్నీ, సిద్దూ, సుఖ్బీర్, అమరిందర్ల స్థాయికి సరిపోయే భగవంత్ మన్ను ఎంపిక చేయడం ఇందుకు ఒక కారణం కాగా, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించారు. ఇది ఓటర్లను ఆకర్షిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్లో కుమ్ములాటలు..
2017లో అమరిందర్ నేతృత్వంలో కాంగ్రెస్ 77 సీట్లతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దూతో విభేదాలు, పార్టీ హైకమాండ్ వైఖరి నచ్చక కాంగ్రెస్ను వీడారు. సొంత పార్టీ పెట్టుకొన్నారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా దళిత నేత చన్నీని సీఎం చేసింది. అయితే, చన్నీకి, సిద్దూకు కూడా పడటం లేదు. తన క్యాంపు వాళ్లకు టికెట్ కోసం సిద్దూ పట్టుబడుతున్నారు. పార్టీలో అంతర్గత పోరు ఉన్నది. అయితే, చన్నీని సీఎం చేయడం దళిత ఓట్ల పరంగా కాంగ్రెస్కు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ కూటమి
అకాలీదళ్తో పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ గరిష్ఠంగా 23 సీట్లలోనే పోటీ చేసింది. కానీ ఈ సారి మాత్రం కూటమిలో అతి పెద్ద పార్టీగా 70-75 సీట్లలో పోటీ చేయనున్నది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన అమరిందర్ ఎంతో ప్రభావం చూపుతారనుకొని ఆయనతో బీజేపీ పొత్తు పెట్టుకొన్నది. అయితే పీఎల్సీ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా లేరు. బీజేపీ 75 సీట్లలో పోటీ చేస్తున్నా కూడా అమరిందరే బీజేపీ కూటమిలో ప్రధాన ఆకర్షణ. అయితే, ఆయను సీఎం అభ్యర్థిగా ప్రకటించే సాహసం బీజేపీ చేయడం లేదు. బీజేపీ కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ప్రజలతో పాటు ఆ కూటమికి కూడా స్పష్టత లేదు.
అకాలీదళ్ ప్రభావం చూపేనా?
కాంగ్రెస్ కంటే ముందు అకాలీదళ్ బీజేపీతో కలిసి పదేండ్లు అధికారంలో ఉన్నది. 2017 ఎన్నికల్లో అకాలీదళ్, బీజేపీ కూటమి కేవలం 18 సీట్లు గెలుచుకొని మూడో స్థానానికి పరిమితం అయినప్పటికీ.. అకాలీదళ్ ఓటు బ్యాంకు 25.24 శాతంతో స్థిరంగా ఉన్నది. అయితే, ప్రస్తుతం రైతులు అకాలీదళ్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ కారణంగా ఓట్ల శాతం తగ్గొచ్చని అంచనా. బీఎస్పీతో పొత్తుతో దళిత ఓట్లు పడొచ్చని అంచనా.
సంయుక్త సమాజ్ మోర్చా సత్తా చాటేనా?
సాగు చట్టాలతో రైతులు పంజాబ్లో పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. మొదట సంయుక్త సమాజ్ మోర్చా, ఆప్ మధ్య పొత్తు చర్చలు జరిగాయి. కానీ కుదరలేదు. తర్వాత హర్యానా రైతు నేత చాదునీ సమాజ్ మోర్చాను 25 సీట్లు కోరారు. 10 సీట్లకు మోర్చా అంగీకరించింది. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా బల్బీర్ సింగ్ రాజేవాల్ ఉన్నారు.