పాట్నా : బిహార్లోని బెట్టియాలోని మఝౌలియా స్టేషన్ సమీపంలో సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ రైలులోని ఐదు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ముజఫర్పూర్-నార్కతియాగంజ్ రైల్వే సెక్షన్లో ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. న్యూఢిల్లీ రైలుకు బోగీలను మళ్లీ అమర్చారు. ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఘటనపై తూర్పు మధ్య రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
సమాచారం ప్రకారం.. రెండు బోగీలను ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే కప్లింగ్ పనిచేయకపోవడంతో బోగీలు ఇంజిన్ నుంచి వేరుపడ్డాయి. ఈ సంఘటన ఉదయం 10 గంటలకు జరిగింది. బోగీల నుంచి వేరైన తర్వాత ఇంజిన్ చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గత ఏడాది డిసెంబర్లో బీహార్లోని టంకుప్ప స్టేషన్లో గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పడంతో రెండు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది. బ్రేక్లు జామ్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.