కశ్మీర్లో సైనికుల రక్తం చిందింది. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లపైకి ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. సైనికుల మృతిపై కశ్మీర్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పాకిస్థాన్కు వ్యతిరేకంగా అక్కడి పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఫూంఛ్తో పాటు సోమవారం జమ్ముకశ్మీర్లో మరో రెండుచోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి.
జమ్ము, అక్టోబర్ 11: కశ్మీర్లో సైనికుల రక్తం చిందింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. పూంఛ్ జిల్లాలో టెర్రరిస్టులు సైనికులపై భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులను సైన్యం సమర్థంగా ఎదుర్కొన్నది. ఉగ్రవాదులు, సైనికుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ పోరులో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో) సహా ఐదుగురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దవాఖానకు తరలించినప్పటికీ జవాన్లు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో నియంత్రణ రేఖ దాటి పూంఛ్ జిల్లాలోని డేరా కీ గాలీ గ్రామంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో సైనికులు సోమవారం వేకువజామున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సైన్యం కదలికలను గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సైనికుల మృతిపై కశ్మీర్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పాకిస్థాన్కు వ్యతిరేకంగా అక్కడి పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా, సోమవారం ఉదయమే అనంత్నాగ్, బందీపొరా జిల్లాల్లో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. అనంత్నాగ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బందీపొరాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా ఉగ్రవాది ఇంతియాజ్ అహ్మద్ను పోలీసులు మట్టుబెట్టారు. ఒక పోలీసుకు గాయాలయ్యాయి.