న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కరోలిన్సా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి ఎంత తరచుగా వ్యాయామం చేసినా, అతని శారీరక బలం, ఫిట్నెస్లు 35 సంవత్సరాల వయసు నుంచి సహజంగా క్షీణించడం ప్రారంభమవుతాయని తేలింది. ఈ పరిశోధకులు 16 నుంచి 63 ఏండ్ల వయసు మధ్య వందలాది మందిని 47 ఏండ్ల సుదీర్ఘకాలం పాటు పరిశీలించారు.
మనం జీవ గడియారాన్ని ఆపలేకపోయినా, మన శరీర క్షీణత వేగంపై గణనీయమైన నియంత్రణను కలిగి ఉండవచ్చని, అది మన చేతుల్లో ఉందని వీరు తెలిపారు. ఈ పరిశోధన జర్నర్ ఆఫ్ కేచక్సియా, సర్కోపినియా అండ్ మజిల్లో ప్రచురితమైంది. ఈ పరిశోధన మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. అవి ఏరోబిక్ సామర్థ్యం, కండరాల శక్తి, కండరాల ఓర్పు. దీని ప్రకారం స్త్రీ, పురుషులు ఇద్దరిలో 26-36 ఏండ్ల మధ్య ఏరోబిక్ సామర్థ్యం, ఓర్పు అత్యున్నత స్థితిలో ఉంటుంది.
తర్వాత ఈ సామర్థ్యం ప్రతి ఏడాది 0.3 నుంచి 0.6 శాతం తగ్గుతూ వస్తుంది. కౌమార దశలో శారీరకంగా చురుగ్గా ఉన్న వ్యక్తులు పెద్ద వయసులోకి ప్రవేశించే సమయానికి ఎక్కువ ‘ప్రాథమిక’ శారీరక సామర్థ్యంతో ఉంటారని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ ఉన్నత స్థాయి ఫిట్నెస్ దశాబ్దాల పాటు కొనసాగుతుంది. అలాంటి వారు జీవితంలో తరువాతి దశలో తమ సామర్థ్యంలో 10 శాతం మెరుగుదలను చూశారు. అంతేకాకుండా ఇది క్షీణత రేటును సమర్థంగా నెమ్మదింప చేస్తుందని నిర్ధారించారు.