అమరావతి: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరించనున్నారు. ఈ సదర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ నౌకలు, జలాంతర్గాముల తయారీలో భారత్ ముందంజలో ఉన్నదన్నారు.
ఈ యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలురకాల క్షిపణులను ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికలను శత్రుదేశాల రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. అదేవిధంగా ఇందులో రెండు మల్టీరోల్ హెలికాప్టర్లు ఉంటాయి. నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రలో విశాఖలోని డాల్ఫిన్నోస్ కొండ, దానిపై ఉండే దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నంగా కొమ్ములతో కనిపించే కృష్ణజింక ముఖ భాగాన్నిఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని ఎంచుకున్నారు.