రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంథాకు తెరతీసింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, ఇతరులు, ప్రభుత్వ శాఖలు తయారు చేసే ఉత్పత్తుల అమ్మకం కోసం ఛత్తీస్గఢ్ మార్ట్ (సి-మార్ట్) పేరుతో ప్రభుత్వ యాజమాన్వంలో నిర్వహించే షాపులను అందుబాటులోకి తెస్తున్నది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో తొలి సి-మార్ట్ను ప్రారంభించారు. గ్రామీణ ఔత్సాహికులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు, స్థానికంగా ఇతరులు తయారు చేసిన ఉత్పత్తులను సీ మార్ట్ల్లో విక్రయిస్తారు.
కాగా, రాయ్పూర్ జిల్లాలో మారిన్ని సీ-మార్ట్లను తర్వలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ సౌరభ్ కుమార్ తెలిపారు. వీటి ఏర్పాటుకు సీఎం భూపేష్ బాఘేల్ ప్రత్యేకంగా చొరవ చూపారని చెప్పారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా రాయ్పూర్లో తయారైన వాటి కోసం, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం సీ మార్ట్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లుగా తెలిపారు. దీంతో రాయ్పూర్లో తొలి ప్రభుత్వ సీ మార్ట్ను ప్రారంభించినట్లు చెప్పారు.
సీ మార్ట్కు ప్రజల నుంచి స్పందన బాగానే ఉందని జిల్లా కలెక్టర్ సౌరభ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉత్పత్తులను కూడా ఇందులో ఉంచి విక్రయిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మూడు నుంచి నాలుగు మెగా సీ మార్ట్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. నెల నుంచి నెలన్నర రోజుల్లో వీటిని ప్రారంభించాలన్న ఆదేశాలు తమకు ఉన్నాయని వివరించారు.