14 ఆగస్టు 1947…
అర్ధరాత్రి 12 గంటలు..
ఒక్కసారిగా మెరుపులతో కూడిన పెద్ద శబ్ధం వినిపించింది. వేల సంఖ్యలో జనం పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మధ్య ‘స్వతంత్ర భారత్కి జై’ అన్న నినాదాలు మిన్నంటాయి. అర్ధరాత్రి సమయంలో ‘వందేమాతరం’ జాతీయ గీతం.. ‘సారే జహాన్ సే అచ్ఛా హిందోస్తా హమారా’ అనే పాటలు హోరెత్తించాయి. స్వేచ్ఛావాయువులను పీల్చిన దేశ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఆలింగనాలు కొనసాగాయి. చిన్నా పెద్దా.. ఆడ మగ.. పేద ధనిక.. బేధం లేకుండా అందరూ ఢిల్లీ నగరంలో జయధ్వానాలు చేస్తూ హర్షాతిరేకాల్లో మునిగితేలారు.
ఆగస్టు 15..
స్వతంత్ర భారతంలో తొలి వేకువ.. ఆశా కిరణాలు విరజిమ్ముతున్నాయి. ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టారు. ఈవెంట్ను గ్రాండ్గా చేసేందుకు లార్డ్ మౌంట్బాటన్ అన్ని చర్యలు తీసుకున్నారు. అందరికన్నా ముందుగా స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నెహ్రూ, ఆయన మంత్రులతో ప్రమాణం కార్యక్రమం కొనసాగింది.
పండిట్ నెహ్రూ కాటన్ జోధ్పురి పైజామా, బందీ ధరించి రాగా.. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెల్లటి ధోవతీతో తళుక్కున మెరిశారు. మిగిలిన నాయకులు గాంధీ టోపీలు ధరించి వచ్చారు.
స్వతంత్ర భారతదేశానికి మొదటి సేవకుడిగా తన పూర్ణ హృదయంతో, కష్టపడి సేవ చేస్తానని కుడి చేతిని గుండెపై ఆనించి తొలి గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ ప్రమాణం చేశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గంలో ఓ మహిళతోపాటు 5 మతాలకు చెందిన 13 మంది మంత్రులకు స్థానం కల్పించారు. గవర్నర్ జనరల్కు 21 తుపాకీలతో గాల్చోకి కాల్చి గౌరవ వందనం చేశారు.
ఎక్కడ చూసినా జనమే జనం..
ఢిల్లీ నలుమూలల నుంచి జనం పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్ వెలుపల గుమిగూడటం ప్రారంభించారు. ఎడ్ల బండ్లు, టాంగాలు, కార్లు, ట్రక్కులు, రైళ్లు, బస్సులు, సైకిళ్లు, కాలినడకన.. ఇలా ఎలా వీలుంటే అలా దేశ ప్రజలు ఢిల్లీ చేరుకున్నారు. ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ పార్క్లో సాయంత్రం 5 గంటలకు మౌంట్బాటన్ భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉన్నది. అయితే, జనం చాలా తక్కువ సంఖ్యలో వస్తారని వేసిన అధికారుల అంచనా తప్పింది. 5 లక్షల మందికి పైగా జనం తరలిరావడంతో ఢిల్లీ నగరం కాస్తా జన సంద్రంగా మారిపోయింది. తన జీవితంలో ఇంత మందిని ఒక్కచోట గుమిగూడటం చూడలేదని ఆ రోజుల్లో బీబీసీ రేడియో తరఫున రిపోర్టింగ్ చేసేందుకు వచ్చిన విన్ఫోర్డ్ వాన్ టోమస్ పేర్కొనడం విశేషం.
త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమం కోసం మౌంట్బాటన్ వేసిన ప్రణాళిక పారకుండా పోయింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కాస్తా జనంలో చిక్కుకుపోయింది. దాంతో జనసందోహం మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సిన వేదికపైకి గవర్నర్ జనరల్ చేరుకోలేకపోయారు. అప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయమని నెహ్రూకు పెద్ద స్వరంతో మౌంట్ బాటన్ ఆదేశించాడు. తన వాహనంపైనే నిలబడి త్రివర్ణ పతాకానికి మౌంట్ బాటన్ సెల్యూట్ చేశాడు.
తొలుత ఇండియా గేట్.. మరుసటి రోజు ఎర్రకోట
ఆగస్టు 15 ప్రధాన ఈవెంట్ను ఇండియా గేట్లోనే నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఉదయం ప్రమాణస్వీకారోత్సవం అనంతరం సాయంత్రం ఇండియా గేట్ వద్ద కవాతు నిర్వహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సి ఉండగా, జనం రద్దీ కారణంగా అంతా అనుకున్నట్లుగా జరగలేదు. ఇండియా గేట్ వద్దనే మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కాగా, మరుసటి రోజు ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోట పైనుంచి జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. దీన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తున్నది.
చేతిలో కవర్.. బట్ లిస్ట్ మిస్సింగ్..
దేశ స్వాతంత్య్ర శుభ ఘట్టం.. దేశ ప్రజల సంతోషాలహేళ మధ్య మరో ఘటన చోటుచేసుకున్నది. స్వాతంత్ర్యం వచ్చిన 20 నిమిషాల అనంతరం మౌంట్ బాటన్కు వద్దకు వెళ్లి దేశానికి మొదటి గవర్నర్ జనరల్గా ఉండాల్సిందిగా రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానించారు. ఇదే సమయంలో నెహ్రూ మొదటి క్యాబినెట్ మంత్రుల జాబితా ఉన్న కవరును లార్డ్ మౌంట్ బాటన్కు అందజేశారు. అయితే, కవరు తెరవగానే అది ఖాళీగా దర్శనమిచ్చింది. దాంతో అందరూ ఆశ్చర్యంతో కనుబొమ్మలు ఎగిరేశారు. చాలా సేపు వెతికిన తర్వాత కవర్లో ఉండాల్సిన మంత్రుల జాబితా నెహ్రూ ఆఫీసులోనే దొరికింది.