ముంబై : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నది. ఆదివారం ఒకే రోజు దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కేసులు నమోదవగా.. మహారాష్ట్ర నాగ్పూర్లో ఒకరికి పాజిటివ్గా తేలింది. దీంతో కలిపి దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల 37కు పెరగ్గా.. మహారాష్ట్రలో 18కు చేరింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుడి నమూనాలను సేకరించి.. జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్లు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) కమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు.
స్థానిక నివాసి అయిన వ్యక్తి ఎనిమిది రోజుల క్రితం పశ్చిమ ఆఫ్రికాలోని ఓ దేశం నుంచి వచ్చాడని, ఆ తర్వాత అతనికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఆ తర్వాత సిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని, అతని శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా.. ఇవాళ రిపోర్టుల్లో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వివరించారు. అతని కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయగా నెగెటివ్గా తేలినట్లు చెప్పారు. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.