శ్రీనగర్: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యింది. శ్రీనగర్ నుంచి తొలి నైట్ ఫ్లైట్ నిన్న టేక్ఆఫ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తొలి నైట్ ఫ్లైట్ను గోఎయిర్ నడిపింది. విమాన సర్వీసును పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజన్ ప్రకాశ్ థాకూర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది కొత్త శకానికి నాంది పలికింది. జమ్ముకశ్మీర్కు ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ఇది దోహద పడుతుంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో పర్యాటకరంగ అభివృద్ధికి బలం చేకూరుతుందని చెప్పారు. పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ట్రావెల్ ఆపరేటర్లు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ ఇప్పటికి నెరవేరిందని తెలిపారు. ఇది కశ్మీర్ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. రాత్రి పూట సర్వీసులు ప్రారంభంకావడంతో జమ్ముకశ్మీర్కు విమానాల రాకపోకలు మరింత పెరుగుతాయని చెప్పారు.