న్యూఢిల్లీ, జూలై 16 : దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్(20%) ఇథనాల్ కలిపిన ఇంధనం వినియోగంపై విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ20 వినియోగానికి సంబంధించిన వాహన వివాదంపై దేశంలోనే మొట్టమొదటి కీలక తీర్పును రాయ్పూర్లోని ఒక వినియోగదారుల కోర్టు వెలువరించింది. ఈ20 ఇంధనం కారణంగా పదేపదే ఇంజిన్ సమస్యలు తలెత్తినట్లు ఆరోపణలు రావడంతో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, దాని అధీకృత డీలర్ను బాధ్యులుగా జిల్లా వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ తేల్చింది. ఈ వాహనానికి చెందిన ఇంజిన్ ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేనప్పటికీ ఆ కారును వినియోగదారుడికి విక్రయించారని కమిషన్ తీర్పునిచ్చింది. 45 రోజుల్లోగా అదే మోడల్కు చెందిన కొత్త ఈ20 అనుకూల వాహనాన్ని అందించాలని, లేదా అదనపు పరిహారంతోపాటు వాహన కొనుగోలు ధర అయిన రూ. 20.5 లక్షలను పూర్తిగా వాపసు చెల్లించాలని ఆ సంస్థను కమిషన్ ఆదేశించింది.
ప్రేమ్రాజ్ దేబ్తా 2024 జూన్ 3న మారుతీ ఎస్యూవీని కొనుగోలు చేశారు. సుమారు ఐదు నెలల తర్వాత నవంబర్ 11న ఆ వాహనంలో మొదటిసారిగా సాంకేతిక లోపం తలెత్తి అది పదేపదే ఆగిపోవడం మొదలైంది. కంపెనీ వర్క్షాప్ మొదట ఈ సమస్యకు కలుషితమైన ఇంధనమే కారణమని భావించి ఇంధన ట్యాంక్ను శుభ్రం చేసి వాహనాన్ని వినియోగదారునికి తిరిగి అప్పగించింది. పదేపదే మరమ్మతులు చేసినప్పటికీ సమస్యలు మాత్రం కొనసాగాయి. రెండవసారి వర్క్షాప్ను సందర్శించినపుడు టెక్నీషియన్లు ఇంధన ట్యాంక్ లోపల తెల్లటి జెల్లీ లాంటి పదార్థాన్ని కనుగొన్నారు.
మొదటి మరమ్మతు సమయంలో ట్యాంక్ను సరిగ్గా శుభ్రం చేయలేదని, రసాయనికంగా కలుషితమైన ఇంధన అవశేషాలు లోపల మిగిలిపోయాయని కంపెనీ అంగీకరించింది. మళ్లీ వెంటనే మూడవసారి వర్క్షాప్ని సందర్శించినపుడు ఇంధన ట్యాంక్, ఇంధన పైపులు, ఇంధన ఫిల్టర్లలో మళ్లీ తెల్లని నిక్షేపాలు, అవశేషాలు కనిపించాయి. ఆ తర్వాత నాలుగవ సందర్శనలో డాష్బోర్డ్ ఇంజిన్ లోపానికి సంబంధించిన హెచ్చరికను చూపించింది. వాహనం ఈవీ మోడ్ పనిచేయడం ఆగిపోయింది. ఐదవ సందర్శనలో ఇంజిన్ పూర్తిగా చెడిపోవడంతోపాటు వాహనం వినియోగానికి పనికిరాకుండా పోయింది. పదేపదే వైఫల్యాలు ఎదురుకావడంతో వినియోగదారుడు కమిషన్ను ఆశ్రయించారు.