Electric Train | భూలోక స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్లో తొలి ఎలక్ట్రిక్ రైలు మంగళవారం పరుగులు తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. దాంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. దాంతో రైల్వే కశ్మీర్ వెళ్లాలనే కల త్వరలోనే సాకారం కాబోతున్నది. శ్రీనగర్ నుంచి సంగల్దాన్, సంగల్దాన్ నుంచి శ్రీనగర్ వరకు రైల్వేశాఖ ఎలక్ట్రిక్ లైన్ నిర్మించింది. ఇది కశ్మీర్లోనే తొలి ఎలక్ట్రిక్ రైలు కావడం విశేషం. రైలు ప్రారంభంతో లోయలో సామాజిక, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సంగల్దాన్-బారాముల్లా స్టేషన్ల మధ్య డెమూను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు స్థానిక రైతులు, వ్యాపారులు, కళాకారులు, విద్యార్థులకు మెరుగైన రవాణా మార్గంగా మారడంతో పాటు ఈ ప్రాంతంలో పర్యాటకరంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ఉపాధిని పెంచుతుందని భావిస్తున్నారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్ల రైలు లింక్ (USBRL)లో దేశంలోనే పొడైన రైల్వే సొరంగాన్ని సైతం ప్రధాని ప్రారంభించారు. ఈ సొంగరం పొడువు 12.77 కిలోమీటర్లు ఉంటుంది. ఖడ్-సుంబాద్ స్ట్రెచ్ మధ్యలో వస్తుందని అధికారులు పేర్కొన్నారు. నార్తర్న్ రైల్వే (NR) ప్రస్తుతం రైళ్లను బారాముల్లా నుంచి బనిహాల్ మీదుగా సంగల్దాన్ వరకు నడుపనున్నది.
బనిహాల్-ఖాదీ-సంబర్-సంగల్దాన్ సెక్షన్లో రైలును నడపడం ద్వారా ఉత్తరాన కశ్మీర్లోయ నుంచి దక్షిణాదిన కన్యాకుమారి వరకు రైళ్లను నడపాలన్న కల సాకారమైంది. బారాముల్లా-బనిహాల్ మధ్య ఎనిమిది డీజిల్ రైళ్లు నడిచేవి. ప్రస్తుతం బారాముల్లా-బనిహాల్ మధ్య ఎలక్ట్రిక్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఇందులో నాలుగింటిని సంగల్దాన్ వరకు పొడిగించారు. త్వరలోనే మరో నాలుగు రైళ్లను సైతం పొడిగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కశ్మీర్లో తొలి ఎలక్ట్రిక్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ పర్యటనలో ప్రధాని రూ.32వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.